World

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..?

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..?
* వాట్ వర్రీస్ ది వరల్డ్ పేరిట జరిగిన సర్వేలో. సంచలన వాస్తవాలు

నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి గురించి పట్టణ ప్రాంత భారతీయులు ఎక్కువగా కలవరం చెందుతున్నారట. అలాగే 10 మందిలో ఇద్దరు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన పడుతున్నారట.
‘వాట్‌ వర్రీస్ ది వరల్డ్’ పేరిట ఇప్సోస్‌ చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్‌లైన వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 మధ్య ఈ సర్వే జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోన్న ముఖ్యమైన సామాజిక, రాజకీయ అంశాలపై అభిప్రాయాన్ని సేకరించింది.ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ద్రవ్యోల్బణం గురించి ఎక్కువగా కలవరపడుతున్నారు. అది గత నెలతో పోల్చుకుంటే రెండు శాతం పెరిగింది. అలాగే పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి వంటివి వారికి ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. ఇక 29 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా.. ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్న ఆ దేశాల జాబితాలో భారత్‌ చివరి స్థానంలో నిలవడం గమనార్హం. ‘కరోనా వైరస్, ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావాలు భారత్‌పై ఉన్నాయి. పట్టణవాసులు వాతావరణ మార్పులపై ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది’ అని ఇప్సోస్ ఇండియా సీఈఓ అమిత్‌ అడార్కర్‌ వెల్లడించారు. 76 శాతం మంది పట్టణవాసులు తమ దేశం సరైన మార్గంలో ప్రయాణిస్తోందని విశ్వసిస్తున్నారని తెలిపారు. ఇతర దేశాలకు భిన్నంగా వీరు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూలత వ్యక్తం చేశారన్నారు. ఈ విషయంలో సౌదీ అరేబియా ముందుస్థానంలో ఉంది. అక్కడ 93 శాతం తమ దేశం పయనిస్తోన్న మార్గంపై నమ్మకం కలిగిఉన్నారు.