హైదరాబాద్ తరహాలో వరంగల్ మహా నగరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్రెడ్డి. ఆ విధంగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని సూచించారు. మామూనూరు ఎయిర్పోర్టు భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై ఐసీసీసీలో సీఎం రేవంత్రెడ్డి గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు.
దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు ఎయిర్పోర్టును ప్రాధాన్యంగా ఎంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఉండాలన్నారు. కొచ్చి ఎయిర్పోర్టు అన్ని వసతులతో ఉంటుందని.. దాన్ని పరిశీలించాలని అధికారులకు తెలిపారు.
వరంగల్ ఔటర్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఉండాలన్నారు. వరంగల్ ఎయిర్పోర్టు నుంచే ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల ప్రజలు భవిష్యత్లో రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
టెక్స్టైల్స్తో పాటు ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల అభివృద్ధితో హైదరాబాద్ను ప్రతిబింబించేలా వరంగల్ ఎదిగేలా ప్రణాళికలు ఉండాలన్నారు. వరంగల్ విమానాశ్రయం పూర్తయితే మేడారం జాతరతోపాటు లక్నవరం, రామప్ప ఇతర పర్యాటక ప్రదేశాలకు వచ్చే ప్రజలు దాన్ని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.
అటు పర్యాటకంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న విషయాన్ని నొక్కి వక్కానించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ మౌలిక వసతులు సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి పాల్గొన్నారు.