TELANGANA

లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? ఎవరు దొంగో తేలుతుంది.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

ఎన్ని ప్రశ్నలు అడిగినా… ఎన్నిరకాల పరీక్షలు పెట్టినా తాను భరిస్తానని… మరి సీఎం రేవంత్ రెడ్డి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తమపై ఉన్న కేసులకు సంబంధించి తామిరువురం ఒకేచోట కూర్చొని అధికారులు, ప్రజలు చూస్తుండగా ప్రశ్నిస్తే… అప్పుడు దొంగ ఎవరో తేలుతుందన్నారు. విచారణ అనంతరం ఆయన ఈడీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

 

రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు ఉందని, అందుకే తనపై కూడా ఏసీబీ కేసు పెట్టించారని ఆరోపించారు. అలాగే ఆయనపై ఈడీ కేసు ఉండటంతో తనపై కూడా పెట్టించారన్నారు. రేవంత్ రెడ్డి, తనపై… ఇద్దరిపై కేసులు ఉన్నాయని, కాబట్టి తామిద్దరికి టీవీల సాక్షిగా రాష్ట్ర ప్రజలు చూస్తుండగా లైడిటెక్టర్ పరీక్షలు పెట్టాలని అప్పుడు ఎవరేమిటో తెలుస్తుందన్నారు. జుబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ప్యాలెస్‌లో అయినా లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా లేదా కోర్టులో అయినా లైడిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధమన్నారు. మీరు సిద్ధమేనా? అని సవాల్ చేశారు.

 

తాను ఏ తప్పు చేయకపోయినప్పటికీ చట్టాలను గౌరవించే వ్యక్తిగా ఈడీ విచారణకు వచ్చానన్నారు. తాను ఈ-ఫార్ములా రేస్ కేసులో ఒక్క రూపాయి అవినీతి చేయకున్నా విచారణకు హాజరయ్యానన్నారు. ఏసీబీలాగే ఈడీ కూడా విచారణలో అవే ప్రశ్నలు అడిగిందన్నారు. అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారన్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పానని వెల్లడించారు. ఈ రోజు కాకున్నా రేపైనా నిజాలు బయటకు వస్తాయన్నారు.

 

తమకు జడ్జిలు, కోర్టులపై నమ్మకం ఉందన్నారు. తాను తప్పు చేయలేదు… చేయబోనని స్పష్టం చేశారు. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. తమకు కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందన్నారు. జడ్జి ముందు లైవ్‌లో విచారణకు సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ చేశారు.