TELANGANA

ఇంటర్ సిలబస్‌లో మార్పులు.. ఏఐ, డేటా సైన్స్‌కు చోటు..?

ఇంటర్ సిలబస్‌లో మార్పులు-చేర్పులు జరుగుతున్నాయా? మారిన సిలబస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుందా? కొన్ని పాఠాలను తొలగించాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందా? రాబోయే కొత్త పాఠాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది స్టూడెంట్స్‌ను వెంటాడుతోంది.

 

మారుతున్న కాలానికి అనుగుణంలో ఇంటర్ విద్యలో మార్పులు చేయాలని తెలంగాణ బోర్డు ఆలోచన చేస్తోంది. ఇప్పటికే వేసిన కమిటీ కసరత్తు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఆర్ట్స్‌లో కొన్ని పాఠాలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో ఏయే పాఠాలు ప్రవేశపెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

 

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఇంటర్ ఫిజిక్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ పాఠాలను చేర్చాలని భావిస్తోంది. జువాలజీకి వస్తే కొవిడ్ మహమ్మారి లాంటి వ్యాధులపై అవగాహన పెంచేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మారిన సిలబస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలన్నది బోర్డు ఆలోచనగా తెలుస్తోంది.

 

ఇంటర్ సెకండియర్‌లో ఎలక్ట్రానిక్స్ ఛాప్టర్‌లో కొంత పార్టు తొలగించి, వాటి స్థానంలో వీటిని ప్రవేశపెట్టాలని సూచన చేసింది. మార్కెట్‌లో ఆయా కోర్సులకు డిమాండ్ ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఈ తరహా కోర్సులకు బీటెక్ మాత్రమే కాకుండా డిగ్రీలో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఆయా సబ్జెక్టులను విద్యార్థులకు పరిచయం చేయాలన్నది ఇంటర్ బోర్డు ఆలోచనగా తెలుస్తోంది.