National

త్వరలో అందుబాటులోకి క్యాన్సర్ టీకా: కేంద్రమంత్రి జాదవ్..

మహిళలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు మరో ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. అయితే, ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

 

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. ముప్పై ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారని తెలిపారు. వ్యాధిని గుర్తించేందుకు డే-కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై కస్టమ్స్ డ్యుటీని రద్దు చేసినట్లు తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.