AP

ఏపీని జగన్ అప్పులకుప్పగా మార్చడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి: పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల నేతలు సమన్వయంతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.

 

వెన్ను నొప్పి కారణంగానే రాష్ట్రంలో తాను కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని తెలిపారు. తనకు ఇప్పటికీ వెన్ను నొప్పి బాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.

 

అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమని పవన్ కల్యాణ్ తెలిపారు. తన మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.