TELANGANA

పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..

మూడు నెలల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుంది. దీంతో రేవంత్ సర్కార్ అటు వైపు ఫోకస్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై దృష్టి పెట్టింది. మాతృభాష తెలుగును రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ పాఠశాలలో తప్పనిసరిగా భోదించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు ఓ సబ్జెక్టుగా ఉండనుంది.

 

ఇకపై తెలుగు సబ్జెక్ట్ పక్కా

 

సెంట్రల్ సిలబస్‌తో నడుస్తున్న స్కూళ్ల‌లో తొమ్మిది, పదో తరగతిలో తెలుగు సబ్జెక్టును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మాతృభాష తెలుగును జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎయిడెడ్ గుర్తింపు పొందిన, CBSE, ICSE, IB బోర్డు పాఠశాలలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. ఆయా స్కూళ్లలో 2018లో అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వివిధ కారణాల వల్ల తెలుగు సబ్జెక్టును కొన్ని పాఠశాలలు అమలు చేయలేదు.

 

అయితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సబ్జెక్టుపై దృష్టి సారించింది. తెలుగును తప్పనిసరిగా బోధించేలా చర్యలు చేపడుతోంది.ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డుల పరిధిలో స్కూళ్ల మేనేజ్‌మెంట్లతో ఎడ్యుకేషన్ అధికారులు సమావేశం నిర్వహించారు.

 

ఇకపై ‘వెన్నెల’ ఎంట్రీ

 

ఇతర సిలబస్‌ స్కూళ్లలోనూ 100 శాతం తెలుగు సబ్జెక్ట్ అమలు లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘సింగిడి’ పుస్తకాన్ని తీసుకొచ్చిన విషయం తెల్సిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు ‘వెన్నెల’ తెలుగు పుస్తకాన్ని బోధించాలని తెలిపింది.

 

ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల విద్యార్థులు తెలుగు సబ్జెక్టును సులభతరంగా అర్థమయ్యేలా ‘వెన్నెల’ విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులకు సూచించారు. దీంతో ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం 2025–26 నుంచి అమలు చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. దీని ఆధారంగా పరీక్షను నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మెమో ద్వారా పాఠశాల యాజమాన్యాలను ఆదేశించింది.

 

ఇప్పటివరకు ఏం జరిగింది?

 

ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూద్దాం. విద్యార్థుల స్కోర్ కోసం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి కొన్ని పాఠశాలలు సంస్కృతం సబ్జెక్ట్ పక్కాగా అమలు చేశాయి. దీనివల్ల విద్యార్థుల మార్కులు పెరుగుతుందని భావించారు. చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఫాలో అవుతూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయా విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. మధ్యలో తెలుగు సబ్జెక్ట్ అంటే కష్టంగా ఉంటుందని అంటున్నారు.

 

మళ్లీ మొదట నుంచి తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు కొందరు స్టూడెంట్స్. సంస్కృతం సబ్జెక్ట్ తీసుకున్న విద్యార్థుల సంఖ్య ప్రైవేటు పాఠశాలలో ఎక్కువగా ఉందని అంటున్నారు. చాలా పాఠశాలలను ఐదు నుంచి అమలు చేయడం మొదలుపెట్టారు. నార్మల్‌గా అయితే ఇంటర్‌లో స్కోర్ కోసం సంస్కృతం సబ్జెక్ట్‌ను విద్యార్థులు ఎక్కువగా తీసుకున్న సందర్భాలు కనిపిస్తాయి. దీనివల్ల వందకు వంద స్కోర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.