TELANGANA

ఉగాది నుండి రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. ఉత్తమ్ కీలక ప్రకటన..

ఉగాది నుంచి రేషన్‌ కోటాలో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ కుమార్‌రెడ్డి చెప్పారు. నిజమైన ఆహారభద్రత కోసం సన్నబియ్యం పంపిణీ ఈనెల 30నుంచి ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదగా సన్నబియ్యం పంపిణీ మొదలవుతుందన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. మూడు రకాల రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. సన్నబియ్యం ఇవ్వబోయే తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు ఉత్తమ్. కొత్తరేషన్లు కార్డుల దరఖాస్తులు, మంజూరు నిరంతర ప్రక్రియగా ఉండబోతుందన్నారు. రేషన్‌లో భాగంగా బియ్యంతో పాటు పప్పు, ఉప్పు లాంటి వస్తువులు ఇస్తామన్నారు ఉత్తమ్. పథకాల అమలులో ఎలాంటి రాజకీయాలు ఉండవన్నారు. కొత్తరేషన్లు కార్డుల దరఖాస్తులు, మంజూరు నిరంతర ప్రక్రియగా ఉండబోతుందన్నారు.

 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో పర్యటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 30న జరిగే సీఎం సభా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఉగాదికి ఈ సభ నుంచే తెల్ల రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

 

ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రాంగణం వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట ఐ. జి.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎస్.పి నరసింహ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్, క్యాడర్ తో సభా ఏర్పాట్లపై సమీక్షించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణి కార్యక్రమం ఇక్కడి నుండి ప్రారంబించుకోవడం ఒక అద్భుతమైన ఘట్టాన్ని అవిష్కరించబోతుందన్నారు.

 

అటువంటి అద్భుతమైన ఘట్టంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయి రాష్ట్ర జనాభాలో 84 శాతానికి అందించ బోతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.