కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆ భూముల్లో చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు తీసుకోకుండా చెట్లను కొట్టివేసినట్లు తేలితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా సంబంధిత అధికారులు అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ప్రశ్నించారు. చట్ట ప్రకారం అనుమతులు తీసుకున్నాకే జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు సింఘ్వీ కోర్టుకు తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.
రూ.10వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో పొందుపరిచిన వివరాలను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకురాగా, చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అనేదే తమకు ముఖ్యమని, ఆ భూముల మార్టిగేజ్ విషయం తమకు అనవసరమని జస్టిస్ బీఆర్ గవాయి తేల్చి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశిస్తూ కేసు విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది
