AP

ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్..! కారణం అదేనా..?

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు, కొద్దిసేపటి కింద ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. జెత్వానీ వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు.

 

ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడలో సీఐడీ అధికారులు ఆయన్ని విచారించనున్నారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. చివరకు బుధవారం ఉదయం ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. జెత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.

 

వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఆంజనేయులు పని చేశారు. కొన్నాళ్లుగా ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ముంబై నటి జత్వాని కేసు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో నిందితుడిగా ఉన్నారు. జెత్వానీ కేసులో ఆయనపై ఇప్పటివరకు ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు.

 

జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేత విద్యాసాగర్.. నటి జెత్వానీని వేధింపులకు గురి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ముంబై వెళ్లి జెత్వానీతోపాటు ఆమె కుటుంబసభ్యులను అరెస్ట్ చేసింది అప్పటి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆనాటి నుంచి ఈ కేసు రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది.

 

ముంబైలో ఓ బిజినెస్‌మేన్‌పై నటి జెత్వాని కేసు వేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ కేసును వాపస్ తీసుకునే విషయంలో జెత్వానీ, ఆయన ఫ్యామిలీ సభ్యులను ముంబై నుంచి విజయవాడకు అప్పట్లో రప్పించారు కూడా. దీనివెనుక ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

 

ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలపై కూటమ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సెప్టెంబర్ 25 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

 

ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసిన విషయం తెలియగానే సస్పెండ్ అయిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారంలో తమను అరెస్ట్ చేస్తారేమోనని భయం వారిని వెంటాడుతోంది. అంతేకాదు ఈ కేసు వెనుక అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు ఓ నేత. ఐపీఎస్ ఆంజనేయులు ఇచ్చిన సమాచారంతో ఆయన్ని సైతం అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు అమరావతిలో ఓ వార్త గుప్పుమంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.