పహల్గమ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత వాయుసేన (ఐఏఎఫ్) సంసిద్ధత, ప్రభుత్వ ప్రతిస్పందన వ్యూహాలపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాయుసేన పరంగా అందుబాటులో ఉన్న ప్రతీకార అవకాశాలపై ప్రధానికి ఆయన వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్లో జరిగిన ఈ సమావేశంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దేశ భద్రతా పరిస్థితులు, ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతీకార చర్యల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీకి కొన్ని గంటల ముందే నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి కూడా ప్రధాని మోదీతో ఉత్తర అరేబియా సముద్రంలోని పరిస్థితులపై చర్చించారు.
నౌకాదళం ఇప్పటికే అరేబియా సముద్రంలో భారీ విన్యాసాలు నిర్వహిస్తోంది. పశ్చిమ నౌకాదళానికి చెందిన అన్ని కీలక యుద్ధనౌకలు, సముద్ర గస్తీ విమానాలు, సహాయక నౌకలు సముద్రంలో మోహరించి ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే, సాధ్యమయ్యే ఏ చర్యకైనా నౌకాదళం సిద్ధంగా ఉందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ తమ సైన్యాన్ని అత్యంత అప్రమత్తంగా ఉంచినట్లు తెలుస్తోంది. వారి ఫ్రంట్లైన్ యూనిట్లలో దాదాపు 30 శాతం దళాలు సరిహద్దు పోస్టుల వద్ద నిరంతరం మోహరించి ఉంటాయని సమాచారం. పాకిస్థాన్ సైన్యం భారీ ఆయుధాలను సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు, ఇటీవలి రోజుల్లో తమ వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుని, అదనపు బలగాలను తరలించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రతిగా, పాకిస్థాన్ నుంచి ఏవైనా ముందస్తు లేదా ప్రతీకార చర్యలను ఎదుర్కోవడానికి భారత్ కూడా వివిధ రంగాల్లో తన దళాలను పునఃసమీకరించి, ఆయుధ సంసిద్ధతను పెంచుకున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.