TELANGANA

ఆరు నెలలు కాల్పుల విరమణ.. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం..!

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు.. కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ.. మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ పేరిట లేఖ విడుదలైంది.

 

‘‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్‌ను ప్రముఖంగా చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టికొని “మా నుండి 6 నెలల వరకు కాల్పుల విరమణను పాటిస్తున్నామని ప్రకటించుచున్నాము.” అని లేఖలో పేర్కొన్నారు.

 

కాగా గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మంది మావోలు చనిపోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కూడా కర్రెగుట్టల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. కాల్పులు జరుపుతూ ముందుకు సాగుతున్నాయి.

 

తెలంగాణ చత్తీస్ గఢ్ బోర్డర్ లో ఉన్న కర్రెగుట్టల్లో CRPF బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులు సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్ కగార్ మంచి ఫలితాలను ఇస్తోంది. 20 వేల మంది కలిగిన భద్రతా బలగాలు మావోల కోసం జల్లెడ పడుతున్నాయి. గత నెల 21వ తేదీ నుంచి మొదలైన మావోల వేట నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోలు చనిపోగా.. భద్రతా బలగాలలో కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. CRPF కోబ్రా యూనిట్‌లోని సభ్యునికి, చత్తీస్ గఢ్ పోలీసు విభాగంలో జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడికి గాయాలయ్యాయి. కర్రెగుట్టల్లో జరిగిన IED బ్లాస్ట్ లో రెండు రోజుల క్రితం కోబ్రా విభాగంలోని అసిస్టెంట్ కమాండర్ సాగర్ ఓ కాలు కోల్పోయారు. ఒక పక్క భద్రతా బలగాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నా.. వెనకడుగు వేయకుండా మావోల భరతం పడుతున్నారు.

 

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ ములుగు జిల్లాలోని ఏజెన్సీ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భద్రతా బలగాల ఫోకస్ మొత్రం కర్రెగుట్టలపై ఉండడంతో వాటిని ఆనుకొని ఉన్న కోయగూడెంలలో భయానక వాతావరణం కనిపిస్తోంది. తమ గ్రామాలపై తిరుగుతున్న ఆర్మీ హెలికాప్టర్‌లు, గుట్టల్లో గర్జిస్తున్న గన్‌లు, పేలుతున్న బాంబులతో అటవీ ప్రాంతం అంతా కనిపించిపోతోంది.

 

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళానికి గెరిల్లా బేస్ క్యాంపుగా కర్రెగుట్టలు పనిచేశాయి. దశాబ్దాల కాలంగా గెరిల్లా ఆర్మీకి శిక్షణ ఇచ్చేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు కర్రెగుట్టలను సేఫ్ జోన్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో మావోయిస్టు దళాలు దండకారణ్యానికి వలస వెళ్లినప్పటికీ… ఎమర్జెన్సీ సమయంలో తలదాచుకునేందుకు ఉపయోగించేవారని నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. దండకారణ్యంలో సాయుధ బలగాలు పైచేయి సాధించడంతో అక్కడి నుండి పరారైన మావోయిస్టు దళాలు కర్రెగుటల్లోకి వచ్చాయని తెలుస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కర్రెగుట్టలను అష్టదిగ్బంధనం చేసి మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు సిద్ధమైంది.

 

ఏప్రిల్ 21 నుంచి కర్రెగుట్టల్లో ఆపరేషన్ కోసం CRPF, కోబ్రా, DRG, STF, బస్తర్ ఫైటర్స్ బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. కర్రెగుట్టలకు ఆనుకొని ఉండే దోబికొండ, నీలం సరాయికొండపై బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి భారీగా ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయి బలగాలు.