ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నల కష్టం మాత్రం తీరడం లేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, పంటలు పండించి ధాన్యపు రాశులను మార్కెట్ కు తరలించిన సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క అకాల వర్షాలు, ఓ పక్క మండుటెండలు అన్నదాతలను విలవిలలాడేలా చేస్తున్నాయి.
మళ్లీ అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అంతేకాదు కొంతమంది అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు వెళ్లి వడ దెబ్బతో మృతి చెందుతున్న ఘటనలు కూడా బాధను కలిగిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ధాన్యపు కుప్ప పైనే వడదెబ్బతో మృతి చెందాడు.
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు కిషన్ అనే రైతు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఘటన పైన బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చేసిన హత్య అని ఆయన పేర్కొన్నారు.
వడదెబ్బలు, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీలలో మునిగి తేలుతున్నాడని కేటీఆర్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర పరిస్థితి అని ఆయన అన్నారు. ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి చేసిన హత్య అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించిన ఆయన ప్రజలలో కూడా ఈ సందేహం పెరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.