దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి.ఇప్పటికే త్రివేణి సంగమం దగ్గర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి శ్రీధర్ బాబు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్కరఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 50లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.
ఉదయం 5.44 గంటలకు తోగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుణ్యాస్నానాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ సరస్వతి ఘాట్లో ఉదయం 6.45 నుంచి 7.35 గంటల వరకు ప్రత్యేక మాలహారతి నిర్వహిస్తారు. వీటితో పాటు రోజూ రాత్రి కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి. అందుకే, ప్రభుత్వం దీని నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తుల కోసం 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
12 ఏళ్లకు ఒకసారి సరస్వతి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి.. మిధున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ నది ఎవరికీ అదృశ్యంగా ప్రవహిస్తుంది కాబట్టి దీన్నే అంతర్వాహిని నది అంటారు. గురువు ఏడాదికోసారి తన రాశిని మార్చుకుంటాడు. అలా ఒక రాశి నుంచి వెళ్లి.. మళ్లీ అదే రాశిలోకి ప్రవేశించడానికి 12ఏళ్లు పడుతుంది.నిన్న రాత్రి 10.35 గంటలకు గురువు మిథున రాశిలోకి ప్రవేశించడంతో పుష్కరకాలం ప్రారంభమైంది.ఇవాళ సూర్యోదయం నుంచి పుణ్యస్నానాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పుష్కరాలు ఈ నెల 26 వరకు జరగనున్నాయి.
పలు రాష్ట్రాల్లోని పీఠాధిపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానమాచరిస్తారని తెలంగాణ దేవాదాయశాఖ తెలిపింది. ఇవాళ మెదక్ జిల్లా రంగంపేటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతిస్వామి పుష్కరాలను ప్రారంభించారు. 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, 19న నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి పుష్కరస్నానం ఆచరించనున్నారు.