TELANGANA

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..! మరో కొత్త పథకం..

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పోడు రైతులకు ఇది ఊహించని తీపి కబురు. రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతుల కోసం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా 6 లక్షల ఎకరాల భూములకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌ మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

 

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కోసం రానున్న ఐదేళ్లలో రూ.12,600 కోట్లను ఖర్చు చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుత సంవత్సరం రూ.600 కోట్ల ను ఖర్చు చేయనుంది. వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి రూ.3వేల కోట్ల చొప్పున ఖర్చు చేయనుంది. పథకం అమలుకు ఎస్టీ ఎస్డీఎఫ్‌ నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం పోడు పట్టాలు పొందిన రైతులను ఉద్దేశించిన పథకం మాత్రమే.

 

ఈ మేరకు ఈ పథకం అమలుకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద పోడు పట్టాలు పొందిన భూముల్లో బోర్లు వేయడం, వాటికి సోలార్‌ పంపు సెట్లు అందించడం కీలకమైంది. 100 శాతం రాయితీతో ఈ పథకాన్ని గిరిజనులకు అందించనున్నారు. పోడు రైతులకు ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రభుత్వమే భరించనుంది. సింపుల్‌గా చెప్పాలంటే గిరిజనులపై ఎలాంటి బారం మోపదన్నమాట.

 

మండలాల వారీగా మే 25 లోపు అర్హులైన రైతులను గుర్తించనున్నారు అధికారులు. జూన్‌ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరగనుంది. జిల్లా స్థాయిలో మే 30 నాటికి సర్వే పూర్తి కానుంది. జూన్‌ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు మొదలు కావాలి. జూన్‌ 26 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకు పోడు భూముల అభివృద్ధి, బోరు బావులు, సోలార్‌ పంపు సెట్లకు మౌలిక సదుపాయాలు కల్పించి తద్వారా ఉద్యాన పంటల పనులు జరగనున్నాయి.

 

ఈ స్కీమ్ గురించి ఇంకా లోతుల్లోకి వెళ్దాం. 2006 అటవీ హక్కుల చట్టం కింద 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడు పట్టాలు మంజూరు చేసింది. ఆయా రైతుల అధీనంలో దాదాపు ఆరున్నర లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. అయితే వాటర్, విద్యుత్తు సదుపాయం లేదు. పూర్తి రాయితీతో సోలార్‌ పంపు సెట్లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.

 

ఒక రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్‌ యూనిట్‌గా పరిగణిస్తారు అధికారలు. అంతకు తక్కువుంటే రెండు నుంచి ఐదుగురు రైతులతో బోర్‌వెల్‌ వినియోగదారుల గ్రూపుగా ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఇది సాధ్యం కాకుంటే దానికి ప్రత్యామ్నాయం గ్రూప్‌ ఏర్పాటు చేస్తారు.

 

జిల్లా స్థాయిలో పథకం అమలు కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉండనున్నారు. పోడు భూములు ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించారు. వాటిలో కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, ములుగు, నిర్మల్, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్ ‌కర్నూల్‌లను గుర్తించారు.