ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం రాజకీయంగా ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమి మాట్లాడతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వైఎస్సార్సీపీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రజలకు కొన్ని కీలక సందేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేసిన విషయం, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం వంటి అంశాలపై జగన్ స్పందించే అవకాశముంది. ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్లుగా మారాయి.
ఇక మీడియా సమావేశం తర్వాత జగన్ ఈ రోజు సాయంత్రం బెంగుళూరుకు ప్రయాణించనున్నారు. సాయంత్రం 04.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, గన్నవరం విమానాశ్రయం నుంచి 05.40 గంటలకు బెంగుళూరుకు వెళ్లనున్నారు. రాత్రి 07.55 గంటలకు ఆయన బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఈ ప్రయాణం వ్యక్తిగతమా లేక రాజకీయ పరంగా ఏదైనా ఉద్దేశ్యమా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే వైఎస్ జగన్ మీడియా సమావేశం, అనంతరం బెంగుళూరు పర్యటన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి.