బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి కాదని.. దెయ్యాల రాజ్య సమితి DRS అని అన్నారు సీఎం రేవంత్రెడ్డి. కొరివి దెయ్యాలను తెలంగాన పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలని పిలుపుఇచ్చారు. బంగారు తెలంగాణను బొందలగడ్డ తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తమ పార్టీలో దెయ్యాలు చేరాయని బీఆర్ఎస్ వాళ్లే అంటున్నారని గుర్తు చేశారు. ఇంటి ఆడబిడ్డే దెయ్యాలు ఉన్నాయంటే నోరువిప్పలేక దెయ్యాల నేత ఫాంహౌజ్లో నిద్రపోతున్నారని అన్నారు సీఎం రేవంత్.
కేసీఆర్ ఆ పాపాలు చేసినందుకే..
ఫాంహౌజ్కు దారి కోసం వాసాలమర్రిని కేసీఆర్ ఆగం చేశారన్నారు సీఎం రేవంత్. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఇళ్లన్నీ కూలగొట్టారని తప్పుబట్టారు. బంగారు తెలంగాణ ముసుగులో పదేళ్లు దోచుకున్న వాళ్లా తనను ప్రశ్నించేదని ఫైర్ అయ్యారు. రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణను దివాళ తీశారని ఆరోపించారు. ఉద్యమకారులు, విద్యార్థులు, రైతులను పొట్టనపెట్టుకున్నారని అన్నారు. పాపాలు చేసినందుకే కేసీఆర్ నడుం విరిగి మంచాన పడ్డారని గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సిందే అన్నారు. తప్పు చేసినందుకే నోటీసులు ఇచ్చారని చెప్పారు. ప్రధాని లాంటి వ్యక్తే మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారని గుర్తు చేశారు.
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే..
ఎవరు అడ్డం పడినా సరే.. మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఫాంహౌజ్లను లాక్కోవడం లేదని.. వేల ఎకరాలు అడగడం లేదని.. అయినా, మూసీ ప్రక్షాళనను బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. 60 కిలోల బంగారంతో యాదగిరి గుట్ట ఆలయ గోపురం నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రూ.1051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
శంకుస్థాపన పనుల వివరాలు:
రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్
రూ.183 కోట్లతో మెడికల్ కాలేజ్ భవన నిర్మాణం
రూ.25.50 కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని వార్డులో వాటర్, డ్రైనేజీ, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం
రూ.7.50 కోట్లతో కొలనుపాక గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి..
రూ.6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం
రూ.8.25 కోట్లతో మోటకొండూరు మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నిర్మాణం
రూ. 22.75 కోట్లతో దాతర్పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణం
రూ. 21.14 కోట్లతో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో బీటీ రోడ్ల నిర్మాణం
రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్ కమిటీలో 2500 మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణం