అమరావతిలో పెద్ద ప్రాజెక్ట్ మొదలైంది. దీనితో మూడు నగరాలకు ఊహించని కనెక్టివిటీ పెరగనుంది. అంతేకాదు ఇక్కడ ఎందరో విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే చాలు, జై అమరావతి.. జైజై రాజధాని అనేస్తారు. ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏమిటో తెలుసుకోండి. మన రాజధాని అద్భుతాన్ని తెలుసుకొని, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిద్దాం.
రాష్ట్ర రాజధాని అమరావతిని ఇప్పుడు దేశానికి గర్వకారణంగా మార్చే పనిని ఏపీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నిర్మాణం ఆగిపోయిందని పలువురు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఈ నగరంలో క్వాంటమ్ వ్యాలీ అనే భారీ ప్రాజెక్ట్ మొదలవుతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతి ఒక అంతర్జాతీయ స్థాయి సాంకేతిక కేంద్రంగా మారబోతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఫ్యూచర్ టెక్నాలజీలపై శిక్షణ, పరిశోధన, ఉద్యోగాలు అందించే విధంగా ఈ ప్రణాళిక రూపొందించారు.
భవిష్యత్ టెక్నాలజీలకు కేంద్రం అమరావతి!
ఇప్పుడు ప్రపంచంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ టెక్నాలజీ ద్వారానే పరిష్కారం కనుగొంటున్నారు. అలాంటి టెక్నాలజీలన్నింటిని ఒకేచోట తెచ్చే ప్రయత్నమే క్వాంటమ్ వ్యాలీ. ఇందులో ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సూపర్ పవర్ కంప్యూటర్లను తయారుచేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనంతట తానే నేర్చుకునే కంప్యూటర్లు, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి భవిష్యత్ రంగాలపై దృష్టి పెట్టనున్నారు.
ఐటీ విద్యార్థులకు భారీ అవకాశం.. 5 లక్షల మందికి శిక్షణ
ఈ ప్రాజెక్ట్ ద్వారా 5 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వబోతున్నారు. అంటే ఏపీ యువతకు గ్లోబల్ స్థాయిలో ఉద్యోగాలు దక్కేలా తయారు చేయనున్నారు. దీని కోసం SRM యూనివర్సిటీ, BITS పిలాని, XLRI వంటి దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్తో కలిసి పని చేయనున్నాయి. ఇది చదువులో ఉన్న యువతకు ఎంతో ఉపయోగపడే అవకాశంగా మారనుంది.
ప్రభుత్వ ఖర్చు లేదు.. ప్రైవేట్ సంస్థలే ముందుకు
ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఖర్చు చేయదు. Public-Private-Partnership అంటే ప్రైవేట్ కంపెనీల సహకారంతో అభివృద్ధి చేస్తారు. ఇక, ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త మోడల్ P4 (Public-Private-People Partnership) తీసుకొస్తున్నారు. అంటే ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు అవుతారు. ప్రభుత్వానికి భారం కాకుండా, ప్రైవేట్ రంగం పెట్టుబడులతో అభివృద్ధి జరగనుంది.
విజయవాడ – గుంటూరు – తెనాలి నగరాలకు లింక్
అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు, తెనాలి నగరాల మధ్య మెరుగైన కనెక్టివిటీ కల్పించి, ఈ ప్రాంతాన్ని ఒక టెక్నాలజీ హబ్గా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. రోడ్లు, మెట్రో, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక వసతులలో కూడా మెరుగుదల తీసుకురాబోతున్నారు.
2047 నాటికి ఆదర్శ రాష్ట్రంగా మార్చే లక్ష్యం
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 100వ సంవత్సరం 2047 నాటికి ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మారుస్తామని ప్రభుత్వ లక్ష్యం. ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఆ దిశగా వేస్తున్న తొలి అడుగు. దేశ అభివృద్ధిలో ఎటువంటి పాత్ర పోషించాలో రాష్ట్రం ముందే చూపించాలన్నదే దీని వెనకున్న ఆలోచన.
పర్యావరణాన్ని దెబ్బతీయకుండా.. గ్రీన్ సిటీగా అభివృద్ధి
ఈ టెక్ సిటీ నిర్మాణం పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంటే చెట్లు కోయకుండా, పొలాలను నాశనం చేయకుండా, సౌరశక్తి వంటి పునరుత్పాదక విద్యుత్ వనరులతో అభివృద్ధి చేయనున్నారు. ఇలా చేస్తే నగరం అభివృద్ధి అవుతుంది కానీ ప్రకృతి మాత్రం చెడిపోదు.
యువతకు కొత్త ఉద్యోగాలు.. పరిశోధనలకు ప్రోత్సాహం
ఈ ప్రాజెక్ట్ వల్ల ఏపీ యువతకు కొత్త అవకాశాలు వస్తాయి. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడకి వస్తాయి. స్టార్టప్ కంపెనీలకు స్థలం కల్పించబడుతుంది. తక్కువ పెట్టుబడితో గొప్ప ప్రయోజనాలు పొందే అవకాశాన్ని ఇది అందిస్తుంది. ముఖ్యంగా సాంకేతికంగా అర్థం చేసుకునే యువత దీనిలో ఉద్యోగాలు, పరిశోధనలకు మంచి అవకాశాలు పొందగలుగుతారు.
ఇది ఒక ఆలోచన కాదు.. ఇది ప్రారంభమయ్యే మార్పు!
ఇప్పటిదాకా అమరావతి గురించి రాజకీయంగా మాత్రమే మాట్లాడారు. కానీ ఇప్పుడు అభివృద్ధి విషయంలో స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వస్తోంది. ఇది కేవలం నిర్మాణం కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ఒక మార్గం. ఇది వాస్తవంగా అమలైతే, దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఉదాహరణగా నిలుస్తుంది. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తారు. 5 లక్షల మంది విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ శిక్షణ, పర్యావరణానికి హాని లేకుండా గ్రీన్ సిటీగా అభివృద్ధి, యువతకు ఉద్యోగ, పరిశోధన అవకాశాలు ఈ ప్రాజెక్ట్ తో దక్కనున్నాయి. అందుకే అమరావతి నగరంకు ప్రపంచ పటంలో కీలక స్థానం దక్కకతప్పదు.