AP

ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి..

పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్మిక భద్రత అంతే ముఖ్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మిక భద్రతా ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు, బీఐఎస్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం మరియు గట్టి భద్రతా ఆడిట్ శిక్షణ (IS 14489:2018 ప్రకారం)’ కార్యక్రమాన్ని నిన్న విజయవాడలోని హయత్ ప్లేస్ హోటల్‌లో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్, కర్మాగార శాఖ ఏపీసీఎఫ్ఎస్ఎస్ సహకారంతో రూపొందించిన ‘factories’ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ మొదటి దశలో భాగంగా థర్డ్ పార్టీ సేవలను, అనగా తనిఖీ, పరికరాల పర్యవేక్షణ వంటి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కర్మాగార శాఖ డైరెక్టర్ యస్.ఉషశ్రీ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. బీఐఎస్ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం వల్ల అధికారులకు పరిశ్రమల సురక్ష పద్ధతుల తనిఖీ కొరకు వారు అనుసరిస్తున్న విధానాలపై మరింత అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే కొన్ని ప్రమాదాలు జరిగాయని, అందులోనూ సినర్జీ కంపెనీలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై నివేదిక ఇవ్వాలని వసుధా మిశ్రా కమిటీని సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నియమించిన విషయాలను గుర్తుచేశారు.

ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించాలి అని ఆలోచిస్తున్న సమయంలో పలువురు అధికారుల చొరవతో అవసరమైన చర్యలన్నీ చేపట్టామని, ప్రమాద నివారణ కొరకు ఏర్పాటు చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని వేగవంతంగా అధికారులు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్మికుల యొక్క ఆరోగ్యం, భద్రత మరియు వారి నైపుణ్యాలను పెంచే బాధ్యత కూడా అంతే ముఖ్యమన్నారు. కార్మిక శాఖ కమిషనర్ ఎం. వి. శేషగిరి బాబు, విజయవాడ శాఖ కార్యాలయ డైరెక్టర్ మరియు హెడ్ ప్రేమ్ సజని పాట్నాల, నిపుణురాలు భావనా కస్తూరియా, మాజీ ఉప డైరెక్టర్ జనరల్ యు.ఎస్.పి. యాదవ్ పాల్గొన్నారు.