అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఎయిరిండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ అండగా నిలిచింది. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన టాటా గ్రూప్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ప్రమాదంలో గాయపడిన వారి వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఓ ప్రకటన విడుదల చేశారు. “ఎయిరిండియా ప్రమాద ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని ఆయన అన్నారు.
“ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ తరఫున రూ.1 కోటి అందజేస్తాం. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. వారి సంరక్షణ బాధ్యత కూడా మాదే. అంతేకాకుండా, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తాం” అని చంద్రశేఖరన్ తన ప్రకటనలో వివరించారు.