అహ్మదాబాద్లో గురువారం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆయన అహ్మదాబాద్కు చేరుకుని, ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విచారాన్ని నింపిందని తెలిపారు.
క్షతగాత్రులను పరామర్శించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, “ఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది” అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. “విమాన ప్రమాదం నుంచి ఒకరు క్షేమంగా బయటపడినట్లు తెలిసింది. నేను అతడిని కలిశాను” అని అమిత్ షా తెలిపారు.
మృతుల గుర్తింపు ప్రక్రియ గురించి వివరిస్తూ, “మృతుల గురించి తెలుసుకొనేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నాం. డీఎన్ఏ టెస్టులు పూర్తి చేసి, నిర్ధారించుకున్న తర్వాతే మృతుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తాం” అని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు.