ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా భార్య సోనమ్ రఘువంశీ బతికే ఉండేందుకు, ఆమె స్థానంలో మరో అపరిచిత మహిళను హత్య చేసి, ఆ మృతదేహాన్ని సోనమ్దిగా నమ్మించి, నిజం బయటపడే వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని హంతకులు పథకం పన్నినట్టు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ దారుణమైన కుట్రకు సోనమ్ ప్రియుడిగా చెబుతున్న రాజ్ కుష్వాహా సూత్రధారి అని, సోనమ్ కూడా ఇందులో సహ కుట్రదారు అని దర్యాప్తులో తేలింది.
ఫిబ్రవరిలోనే ప్లాన్కు ప్రణాళిక
పోలీసుల కథనం ప్రకారం.. రాజా హత్యకు సంబంధించిన ప్రణాళిక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇండోర్లో ప్రారంభమైంది. రాజాను హత్య చేసిన తర్వాత సోనమ్ ఎలా అదృశ్యం కావాలనే దానిపై హంతకులు పలు రకాలుగా ఆలోచించారు. “సోనమ్ నదిలో కొట్టుకుపోయిందని నమ్మించడం ఒక ప్లాన్. ఎవరైనా మహిళను హత్య చేసి, ఆ మృతదేహాన్ని కాల్చివేసి, అది సోనమ్దేనని చెప్పడం. అయితే, ఈ ప్లాన్లు ఏవీ కార్యరూపం దాల్చలేదు” అని ఒక పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు.
ఈ పథకాలు ఫలించకపోవడంతో షిల్లాంగ్, సోహ్రా వెళ్లాలని సోనమ్ నిర్ణయించుకుంది. అక్కడ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నిందితులందరూ నాంగ్రియాట్లో కలుసుకున్నారు. మే 19న నూతన వధూవరులు రాజా, సోనమ్ అస్సాం చేరుకోగా, అంతకు కొన్ని రోజుల ముందే హత్యలో పాలుపంచుకున్న ముఠా సభ్యులు అక్కడికి చేరుకున్నారు.
దారుణ హత్య.. సోనమ్ పరారీ
ఎస్పీ సయీమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 23న మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:18 గంటల మధ్య వీరంతా కలిసి వైసాడాంగ్ జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ అసోంలో కొనుగోలు చేసిన కత్తితో రాజ్, ఆకాశ్, విశాల్ ముగ్గురూ సోనమ్ ఎదుటే రాజాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని లోయలో పడేశారు. “ఆకాష్ షర్ట్పై రక్తపు మరకలు ఉండటంతో, సోనమ్ తాను ధరించిన రెయిన్కోట్ను అతనికి ఇచ్చింది. తర్వాత ఆ రెయిన్కోట్కు కూడా రక్తం అంటడంతో ఆకాష్ దాన్ని పారేశాడు. సోనమ్, రాజా అద్దెకు తీసుకున్న టూ-వీలర్ను కూడా వారు ఒకచోట వదిలేశారు” అని ఎస్పీ వివరించారు. సోనమ్ అదృశ్యమైందని భావించిన సమయంలో పోలీసులు ఈ రెయిన్కోట్, టూ-వీలర్ను స్వాధీనం చేసుకున్నారు.
హత్య అనంతరం రాజ్ కుష్వాహా విశాల్కు ఇచ్చిన బురఖాను సోనమ్కు అందించాడు. అది ధరించిన సోనమ్ పోలీస్ బజార్కు వెళ్లి, అక్కడి నుంచి టాక్సీలో గువాహటి చేరుకుంది. అక్కడి నుంచి బస్సులో పశ్చిమ బెంగాల్లోని సిలిగురికి, అక్కడి నుంచి బస్సుల్లో పాట్నా, ఆరా మీదుగా లక్నోకు ప్రయాణించింది. లక్నో నుంచి బస్సులో ఇండోర్ చేరుకుంది. ఇంతలో మేఘాలయ మీడియా ఒక టూర్ గైడ్ను ఇంటర్వ్యూ చేయగా అతను సోనమ్, రాజాలను మరో ముగ్గురు వ్యక్తులతో చూసినట్టు చెప్పాడు.
అనుమానం రాకుండా అపహరణ నాటకం
సిలిగురిలో ఎక్కడైనా ప్రత్యక్షమై తనను ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడాలని రాజ్.. సోనమ్కు సూచించాడు. రాజా మృతదేహం మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల దొరకదని, పోలీసుల విచారణకు ఒకటి రెండు నెలలు పడుతుందని వారు భావించారు. ఈలోగా బాధితురాలిగా డ్రామా ఆడాలని సోనమ్ ప్లాన్ వేసింది.
అయితే, జూన్ 8న సోనమ్ ఇండోర్ విడిచి వెళ్లినప్పుడు మేఘాలయ పోలీసులకు చెందిన రెండు బృందాలు సివిల్ దుస్తుల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లకు చేరుకున్నాయి. “యూపీలో ఆకాశ్ను మొదట అరెస్ట్ చేయడంతో రాజ్ కంగారుపడ్డాడు. వెంటనే సోనమ్కు ఫోన్ చేసి తాను కిడ్నాప్ గ్యాంగ్ నుంచి ఇప్పుడే తప్పించుకున్నానని కుటుంబ సభ్యులకు చెప్పమని సూచించాడు. ఈ విధంగా ఘాజీపూర్లో ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది” అని ఎస్పీ సయీమ్ తెలిపారు.
“మేము వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నాము. వారిని ప్రశ్నిస్తున్నాం. మరిన్ని ఆధారాలు సేకరించి, నేరం జరిగిన తీరును రీకనస్ట్రక్ట్ చేస్తాం” అని సయీమ్ చెప్పారు. ఈ కేసులో నిర్దేశిత 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిందితులందరినీ ఈ నెల 11న ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.