ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. విశాఖ తీరంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ భారీ ఈవెంట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్కొన్నారు.
ప్రపంచ దేశాలను ఏకం చేసిన ఘతన యోగాది అన్నారు ప్రధానమంత్రి మోడీ. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యోగాసనాలు సాధన చేశారు. కోట్ల మంది జీవితాల్లో యోగ కొత్త వెలుగులు నింపిందన్నారు మోడీ. ఆరోగ్యం కోసం, సమాజం కోసం ప్రతి ఒక్కరు యోగ సాధన చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి.
యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ట్రెండ్ సెట్టర్గా నిలిచిందన్నారు. భారతీయ సంప్రదాయ విద్యలకు పెద్దపీట వేసిన ఘనత ప్రధానమంత్రికి మోడీకి దక్కుతుందని చంద్రబాబు అన్నారు.
విశాఖ సాగరతీరంలో ఉదయ భానుడిని స్తుతిస్తూ.. తన ప్రసంగం ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. యోగాంధ్రలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు ప్రాధాన్యం దక్కిందన్నారు. ఆ ఘతన ప్రధానమంత్రి మోడీదే అన్నారాయన.
ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు పచ్చిటి తివాచీపై 5లక్షల మంది పాల్గొన్నారు. 34 కిలోమీటర్ల మేర ఏర్పాటుచేసిన 326 కంపార్ట్మెంట్లలో యోగా చేశారు. ఏయూ మైదానంతో పాటు.. గోల్ఫ్ క్లబ్, పీఎంపాలెం క్రికెట్ స్టేడియం, పోర్ట్ స్టేడియం, రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సహా మొత్తం 18 క్రీడా మైదానాల్లో 5 లక్షల మంది యోగాసనాలు వేశారు. ప్రజలను కంపార్ట్మెంట్లకు తరలించేందుకు యాప్లను వాడారు అధికారులు.
ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదికను ఏర్పాటు చేశారు అధికారులు. కార్యక్రమంలో పాల్గొనేవారికి ముందుగానే రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించారు. ఉచితంగా యోగా మ్యాట్లు, టీ షర్ట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు 62 కోట్ల బడ్జెట్తో నిర్వహిస్తున్నారు. ప్రజల అవసరాల కోసం 3వేల తాత్కాలిక మరుగుదొడ్లు, ప్రతి ఐదు కంపార్ట్మెంట్లకు ఒక వైద్య శిబిరం, ప్రధాన వేదికల వద్ద పది పడకల తాత్కాలిక ఆస్పత్రి నిర్మించారు.
కార్యక్రమానికి వచ్చిన ప్రజల తరలింపునకు 3,600 ఆర్టీసీ బస్సులు, 7,295 ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. మోడీ రాకతో.. మొత్తం 10వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 2వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.