AP

ఎమర్జెన్సీ, జగన్ పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, అటువంటి నియంతృత్వ పోకడలు, అహంకారం ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ చెల్లవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి రాజ్యాంగ మూల సిద్ధాంతాలను ఎవరూ విస్మరించరాదని ఆయన హితవు పలికారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి (జూన్ 25) 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన “సంవిధాన్ హత్యా దివస్” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 

ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య హననం

 

ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, 1975 జూన్ 25వ తేదీ భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన రోజని, దేశ చరిత్రలోనే అదొక చీకటి దినమని అభివర్ణించారు. “అది భారత రాజ్యాంగాన్ని, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసిన రోజు. ఏకంగా 21 నెలల పాటు దేశమంతటా అత్యవసర పరిస్థితి విధించారు. ఇది తప్పు అని ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టారు, సామాన్యులను హింసించారు, న్యాయ వ్యవస్థలను కబళించారు. ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు” అని చంద్రబాబు ఆనాటి పరిస్థితులను గుర్తుచేశారు.

 

1975 జూన్ 12న అలహాబాద్ కోర్టు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చినా, సుప్రీంకోర్టు ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగి ప్రజల వద్దకు వెళ్లవచ్చని సూచించినా నాటి పాలకులు వినకుండా, అహంభావంతో ఎమర్జెన్సీ విధించారని తెలిపారు. జయప్రకాష్ నారాయణ, వాజ్‌పేయి, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి జాతీయ నాయకులతో పాటు రాష్ట్రానికి చెందిన అనేక మందిని నిర్బంధించారని, బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని అన్నారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా బర్తరఫ్ చేశారని, అయితే ఎన్టీఆర్ ప్రజాస్వామ్యవాదులతో కలిసి పోరాడి 30 రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ప్రజాస్వామ్య విజయమని చంద్రబాబు కొనియాడారు.

 

గత ఐదేళ్ల పాలనపై విమర్శలు

 

ఈ సందర్భంగా, రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల పాలన కూడా నియంతృత్వానికి నిదర్శనమని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. “పాలన ఎలా ఉండకూడదో చెప్పడానికి ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో చెప్పడానికి గత ఐదేళ్ల పాలన మరో కేస్ స్టడీ” అని ఆయన వ్యాఖ్యానించారు. తాను కూడా ఆ పాలనలో బాధితుడినేనని, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన తాను ఇంతటి దారుణమైన పాలనను ఎన్నడూ చూడలేదని అన్నారు. అన్యాయాలు, అక్రమాలు, అవినీతితో చెలరేగిపోయారని, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేశారని ఆరోపించారు. మోసాలు, దాడులు, అక్రమ కేసులు, రౌడీయిజం, ఆస్తులు రాయించుకోవడం వంటి అనేక అరాచకాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను వేధించి, పిచ్చివాడిగా ముద్రవేసి ఆయన మరణానికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ప్రజాస్వామ్య విలువలు, సుపరిపాలన

 

భారతదేశం 78 ఏళ్ల స్వాతంత్ర్య ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందని చంద్రబాబు అన్నారు. మంచి చెడులను గుర్తుంచుకుని, భవిష్యత్ తరాలకు మంచిని అందించాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో ఉన్న తమపై ఉందని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల కోసం పనిచేస్తూ గోరా మరణించారని డాక్టర్ సమరం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలకు మంచి చెడులను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా “సంవిధాన్ హత్యా దివస్” కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు.

 

ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మాట్లాడుతూ, “బీజేపీ, జనసేనలతో కలిసి ముందుకెళ్తున్నాం. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు నడిపిస్తామని చెప్పి ఒక్క ఏడాదిలోనే సుపరిపాలన దిశగా తొలి అడుగు వేశాం” అని ముఖ్యమంత్రి తెలిపారు. మిత్రుడు పవన్ కల్యాణ్ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ముందుకు వచ్చారని ప్రశంసించారు. తనను అభిమానించిన తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ తరం వారికి ఎమర్జెన్సీ గురించి పెద్దగా తెలియకపోవచ్చని, వారంతా చరిత్రను చదువుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్‌ను, మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రను సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.