TELANGANA

బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం.. స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్..

బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు ఎంతమాత్రం విశ్వసించవద్దని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.

 

“కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో సాగుతున్న సామాజిక న్యాయం మరే ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పథకాలను ప్రవేశపెట్టింది. దీనికి నిదర్శనమే హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో హడావుడిగా దళితబంధు పథకాన్ని తీసుకురావడం” అని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన అందిస్తోందని, దీనిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కట్టుకథలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కంటే, కేవలం 18 నెలల తమ కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. “పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో, వారి పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలందరికీ బాగా తెలుసు. రాష్ట్ర ప్రజల అవసరాలను, రాష్ట్ర హక్కులను గత ప్రభుత్వం పూర్తిగా తాకట్టుపెట్టింది” అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

 

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై తమ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోందని, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజలకు వాస్తవాలు వివరించి, భారాస చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.