AP

ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ వార్నింగ్..!

అహంకారం, ఇగోలను పక్కన పెట్టండి.. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడండి..! కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి జనాలకు వివరించండి..ఇదీ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు.. మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న దిశానిర్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన ఏర్పాటై ఏడాది పూర్తైన నేపథ్యంలో.. తెలుగు తమ్ముళ్లు జనంలోకి వెళుతున్న వేళ.. నారా లోకేశ్ చేసిన హితబోధ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ లోకేశ్ హెచ్చరికల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?

 

అంతటి గ్రాండ్ విక్టరీ కొట్టి ఏడాది పూర్తైపోయింది

 

కనీవిని ఎరుగని విజయం.. చరిత్రాత్మక సందర్భం.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించి.. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంపై ప్రతి టీడీపీ కార్యకర్తా, నేత అభిప్రాయమిదే. అంతటి గ్రాండ్ విక్టరీ కొట్టి ఏడాది పూర్తైపోయింది.

 

కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు..?

 

ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి పాలనపై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు..? పథకాల అమలు, అభివృద్ధి విషయంలో వారి మనసులో మాటేంటి..? అర్హులందరికీ పథకాలు సరిగ్గా చేరుతున్నాయా..? అన్ని అర్హతలు ఉన్నా ఎవరికైనా సర్కారు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందడం లేదా..? ఇలా అనేక అంశాలపై ప్రజలనే స్వయంగా కలిసి మాట్లాడేందుకు, వారి అభిప్రాయాలు తీసుకునేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.

 

జులై 2 నుంచి ఇంటింటికీ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు

 

ఇందులో భాగంగా వచ్చేనెల 2 నుంచి ఇంటింటికీ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వెళ్లనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, నేతలు, పార్టీ సీనియర్లకు దిశా నిర్దేశం చేశారు అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి.. ప్రజలకు ఏయే అంశాలు వివరించాలి అన్న విషయాలపై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు.. ఈనెల 29న జరగనున్న టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో మరింతగా వివరించనున్నారు.

 

నేతలకు దిశానిర్దేశం చేసిన మంత్రి నారా లోకేశ్

 

ఇదే సమయంలో మంత్రి నారా లోకేశ్ మాత్రం పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు, కేడర్‌కు కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీది పెద్దన్న పాత్రని, మిగిలిన పార్టీలను సైతం కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మనదేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారట లోకేశ్. అంతేకాదు.. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితబోధ చేశారట. అన్నింటికంటే ప్రధానంగా నేతలెవరూ అహంకారానికి, ఇగోలకు పోవద్దని సూచించారట మంత్రి లోకేశ్.

 

గత పాలకుల మాదిరిగా వ్యవహరించవద్దని హితబోధ

 

గత పాలకులు అహంకారంతో వ్యవహరించడం వల్లే ప్రజలు సహించ లేదని.. అందుకే వైసీపీ సీట్ల సంఖ్య 151 నుంచి 11కు పడిపోయిందని వివరించారట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రజల్లోకి వెళ్లాలని, వారు చెప్పే సమస్యలు వింటూ పరిష్కారానికి కృషి చేయాలని చెప్పుకొచ్చారట నారా లోకేశ్. ఈ క్రమంలో ఎవరైనా తప్పటడుగులు వేసినా, సంయమనం కోల్పోయినా ఆ ప్రభావం పార్టీపై పడుతుందని సుతిమెత్తగా హెచ్చరించారట మంత్రి లోకేశ్.

 

నాయకులు చేసే తప్పులకు పార్టీపై..

 

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటైన విషయాన్ని నేతలకు మరోసారి వివరించారట లోకేశ్. కూటమి పార్టీల మధ్య ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని, సామరస్యంతో పరిష్కరించుకుందామని సూచించారట. అంతేకాదు.. వైసీపీ హయాంలో టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులు పడిన ఇబ్బందులు, చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు తాము చేసిన పోరాటం సహా ఇతర అంశాలను ప్రస్తావించారట మంత్రి లోకేశ్.

 

ఏపీ ప్రయోజనాల కోసమే కూటమి అంటూ..

 

టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు గడపగడపకూ వెళ్లిన సమయంలో.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, సూపర్ సిక్స్‌లో భాగంగా ఒక్కోటిగా అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి ఒక్కరూ వివరించాలని సూచించారట మంత్రి లోకేశ్. తల్లికి వందనం పేరుతో ఒక్కసారే లబ్దిదారుల ఖాతాల్లో 8వేల 745 కోట్లను జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారట. ఇదే సమయంలో గత ప్రభుత్వం కారణంగా ఇప్పుడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేసిన విషయాన్ని ఒక్కో కుటుంబానికి పూర్తి స్థాయిలో వివరించాలని దిశానిర్దేశం చేశారట లోకేశ్. దీంతోపాటు మెగా డీఎస్సీ ద్వారా 16 వేల 347 టీచర్ పోస్టుల భర్తీ, పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చేస్తున్న కృషి, వృద్ధులకు మరే రాష్ట్రంలో లేని విధంగా 4వేల రూపాయల పెన్షన్, ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్న విషయం లాంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయాలని తెలుగు తమ్ముళ్లకు సూచించారట లోకేశ్.

 

నేతలకు సూచించిన మంత్రి లోకేశ్‌

 

కేవలం ఇవే కాదు.. ఏడాది పాలన పూర్తైన సందర్భంగా వివిధ అంశాల్లో నేతలకు భరోసా సైతం ఇచ్చారట మంత్రి నారా లోకేశ్. గత ప్రభుత్వం కక్ష సాధింపుతో నిలిపి వేసిన నీరు చెట్టు బిల్లులను ఇప్పటికే 90 శాతం క్లియర్ చేశామని.. త్వరలోనే మిగిలినవి సైతం జమ చేస్తామని హామీనిచ్చారట. కార్యకర్తలపై వైసీపీ హయాంలో నమోదైన కేసులను మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారట. అంతేకాదు.. అధికారంలోకి వచ్చినా పార్టీ కేడర్‌ను నిర్లక్ష్యం చేయకుండా సీఎం చంద్రబాబు తమ జిల్లా పర్యటనలో కలుస్తున్నారని, తాను సైతం అదే దారిలో వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారట లోకేశ్. అయితే.. ఇంత చేస్తున్నా పది నిర్ణయాల్లో ఒక తప్పు జరగొచ్చని.. అలాంటప్పుడు ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారట మంత్రి లోకేశ్.

 

నేతలకు భరోసా ఇచ్చిన మంత్రి లోకేశ్

 

మొత్తంగా వైసీపీ పాలనలో జరిగినట్లు కాకుండా కూటమి పాలన ఉండాలని కోరుకుంటున్నారట మంత్రి లోకేశ్. పైగా గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన నేపథ్యంలో.. ప్రతి నేతా, కార్యకర్తా ఆచితూచి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారట మంత్రి లోకేశ్.