ఆంధ్రప్రదేశ్ను షెల్టర్గా మార్చుకుని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడ్వీ హిడ్మా సహా 6 గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత, ఏపీలోని విజయవాడ, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో OCTOPUS, గ్రేహౌండ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్లు ఏకకాలంలో రైడ్స్ నిర్వహించి, మొత్తం 31 మంది మావోయిస్టులను మరియు వారికి సహకరించిన వారిని అరెస్టు చేశారు.
అరెస్ట్ అయిన వారిలో అత్యధికులు విజయవాడలోని కానూరు న్యూ ఆటోనగర్లోని ఓ భవనంలో పట్టుబడ్డారు. ఇందులో 21 మంది మహిళలు సహా, మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ తిప్పిరి తిరుపతి (దేవూజీ) ప్రొటెక్షన్ వింగ్ సభ్యులు, సౌత్ బస్తర్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో కూడా 10 మంది మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు. మావోయిస్టుల కదలికలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో వారిని ఏపీ నగరాల్లో అరెస్టు చేయడం ఇదే మొదటిసారి అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
చత్తీస్గఢ్లో బలగాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న మావోయిస్టులు, తమ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేసే ప్రయత్నంలో భాగంగా ఏపీలోని కీలక నేతలను హత్య చేయడం ద్వారా తమ ఉనికిని బలంగా చాటాలనుకున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే ఇంటలిజెన్స్ సమాచారంతో పోలీసులు వారి ప్రణాళికలను భగ్నం చేశారు. అరెస్టుల అనంతరం పోలీసులు స్వాధీనం చేసుకున్న హిడ్మా డైరీ ఆధారంగా ఆయుధాలు, సరుకులు, మందులు దాచిన డంపుల కోసం ఏపీతో పాటు చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిషాలో కూడా ఫోర్-స్టేట్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

