ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్లో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పున మర్గం’ (పునరావాసం నుంచి పునరుజ్జీవనం) అనే కార్యక్రమంలో భాగంగా, మంగళవారం నారాయణ్పూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వీరిలో 19 మంది మహిళలు ఉండగా, అందరిపైనా కలిపి మొత్తం రూ. 89 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు వీరు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
లొంగిపోయిన వారిలో మాద్ డివిజన్ డీవీసీఎం, పీఎల్జీఏ కంపెనీ నెం. 06 మిలిటరీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు, టెక్నికల్ టీమ్ సభ్యుడు వంటి కీలక స్థాయిలకు చెందిన వారు ఉన్నారు. వీరు ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఇన్సాస్, ఒక .303 రైఫిల్తో సహా ఆయుధాలను భద్రతా దళాలకు అప్పగించారు. ఈ లొంగుబాట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బస్తర్ పోలీసులు మరియు భద్రతా దళాలు సంయుక్తంగా చేపట్టిన చర్యలకు దక్కిన విజయంగా అధికారులు పేర్కొన్నారు.
నారాయణ్పూర్ ఎస్పీ రాబిన్సన్ గుడియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ పరిణామంతో 2025లో ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 287 మంది మావోయిస్టు క్యాడర్లు లొంగిపోయారు. అంతేకాకుండా, గత 50 రోజుల్లోనే బస్తర్ వ్యాప్తంగా ఏకంగా 512 మంది మావోయిస్టు క్యాడర్లు హింసను వీడి జనజీవన స్రవంతిలో చేరారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పత్తిలింగం పేర్కొన్నారు. ఈ గణాంకాలు మావోయిస్టుల అగ్ర నాయకులు దేవ్జీ, రామ్దర్లకు కూడా లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఐజీ అన్నారు.

