తెలంగాణలో మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, తొలి విడత ప్రచార గడువు నేడు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గత కొద్ది రోజులుగా గ్రామాల్లో హోరెత్తించిన నేతలు మరియు అభ్యర్థులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. డిసెంబర్ 11 (గురువారం) నాడు తొలి విడత పోలింగ్ జరగనుండటంతో, ఈ రెండు రోజులు ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రలోభపెట్టేందుకు వారి మద్దతుదారులు తమ వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉంది. పోలింగ్కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
తొలి విడతలో మొత్తం 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల ప్రక్రియ కోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడతలో మొత్తం 56 లక్షల 19 వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు, వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ఈ విడతలో ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శాంతియుత పోలింగ్ నిర్వహణ కోసం అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు, నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి (గురువారం) సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే, పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం నుంచే ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ ప్రారంభమై, అనంతరం విజేతల పేర్లను ప్రకటిస్తారు.

