TELANGANA

హస్తం వీడి కారు ఎక్కిన జీవన్ రెడ్డి..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ (BRS)లో చేరునున్న‌ట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న జీవన్ రెడ్డి చేరికను పార్టీ బలోపేతానికి ఒక కీలక మలుపుగా బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

 

గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ, తాను బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. “నా శేషజీవితంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయడం అనివార్యమని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ప్రజా సమస్యలపై పోరాడటానికి మరియు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి బీఆర్ఎస్ సరైన వేదిక అని ఆయన వెల్లడించారు.

 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి, జీవన్ రెడ్డికి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ పరిచయం, స్నేహబంధం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి జీవన్ రెడ్డి పట్ల కేసీఆర్ ఎప్పుడూ ప్రత్యేక గౌరవాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారని తెలిపారు. అసెంబ్లీలోనైనా, బయటైనా రైతుల సమస్యలపై గట్టిగా గొంతు వినిపించే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కేసీఆర్ గారి సూచన మేరకు ఉమ్మడి జిల్లా నాయకులమంతా కలిసి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించామని కేటీఆర్ పేర్కొన్నారు.

 

జీవన్ రెడ్డి పట్ల కేసీఆర్ కి ఉన్న ప్రేమకు నిదర్శనంగా ఒక పాత సంఘటనను కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో జగిత్యాల ప్రజల తరపున బోర్ణపల్లి గ్రామానికి ఒక బ్రిడ్జ్ కావాలని జీవన్ రెడ్డి చిన్న విన్నపం చేయగానే, కేసీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా అక్కడికక్కడే రూ. 75 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు మంజూరైన మొట్టమొదటి భారీ ప్రాజెక్టు అదేనని, అది కేవలం జీవన్ రెడ్డిపై ఉన్న గౌరవంతోనే జరిగిందని ఆయన వివరించారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోతోందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు కింద దాదాపు రూ. 27,000 కోట్లు ఎగ్గొట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష, అహంకారం ప్రజలను అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞులైన నాయకులు బీఆర్ఎస్ లోకి రావడం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తుందని అన్నారు. రెండు మూడు రోజుల్లో జీవన్ రెడ్డి కేసీఆర్ ని కలిసి తన తుది నిర్ణయం ప్రకటిస్తారని, పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.