TELANGANA

కవిత స్థాపించిన ‘టీఆర్ఎస్’పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు .

తన సోదరి కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ గురించి చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారని, వాటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

 

తేజస్వీ సూర్య మాట్లాడితే మొదట ఖండించింది మేమే

 

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంటులో తెలంగాణ విభజన గురించి తప్పుగా మాట్లాడితే ముందుగా ఖండించింది తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావులేనని కేటీఆర్ గుర్తు చేశారు. తేజస్వీ సూర్య తనకు కూడా ఫోన్ చేసి, తాను మాట్లాడిన దానిని మీ (బీఆర్ఎస్) వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారని, కానీ మీరు మాట్లాడింది తప్పని ఆయనకు చెప్పేశానని కేటీఆర్ తెలిపారు. మేం ఖండించిన తర్వాతనే ఆయన సభలో వివరణ ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభలో ఉండి ఉంటే మా వాళ్లు అప్పుడే ఖండించేవారని చెప్పారు.