ప్రజలకు, వైద్యులకు ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా… ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలను ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రజలు మరియు వైద్యులు తమ మొబైల్ నుంచి 9552300009 వాట్సాప్ నంబర్కు “హాయ్” లేదా “Hi” అని మెసేజ్ పంపి.. తదనంతరం వచ్చే మెనూలో ‘ఆరోగ్య శాఖ’ ఆప్షన్ను ఎంచుకుని ఈ సేవలను సులభంగా పొందవచ్చు.
ఈ సరికొత్త విధానం ద్వారా వైద్యులు తమ రిజిస్ట్రేషన్ వివరాలు, దరఖాస్తుల స్థితిగతులు, రాబోయే సీఎమ్ఈ (CME) కార్యక్రమాలు, క్రెడిట్ పాయింట్ల సమాచారాన్ని అరచేతిలోనే తెలుసుకోవచ్చు. అలాగే, సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఓపీ సేవలు, బ్లడ్ బ్యాంక్ లలో రక్త లభ్యతతో పాటు ఆసుపత్రులలో మందులు, శస్త్రచికిత్సకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉందో లేదో ఇట్టే ఆరా తీయవచ్చు. వైద్యులకు, రోగులకు ఒకే వేదికపై అత్యవసర సమాచారాన్ని అందిస్తూ, పౌరసేవలను మరింత చేరువ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం వేసిన ఈ అడుగు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

