పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆమె తోసిపుచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, టీఎంసీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, 2021, 2024లోనూ అలాగే చేశాయని అన్నారు. స్టాక్ మార్కెట్ను తారుమారు చేయడానికే ఎగ్జిట్ పోల్స్ తప్పుడు ప్రచారాలని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు.

