National

ఆమెను బయటకు గెంటేయండి: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీపై సీనియర్ న్యాయవాది సంచలన వ్యాఖ్య‌లు..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ప్రవర్తన క్షమించరానిదని, ఇది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే విసిరిన సవాల్ అని అభివర్ణించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

“ఎన్నికల సంఘం ఫలితాలను ధ్రువీకరించిన క్షణం నుంచి ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోతారు. అయినా ఆమె కుర్చీకి అతుక్కుపోవాలని చూస్తున్నారు. ఇది అవమానకరం. ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలి. గౌరవంగా రాజీనామా చేయకుండా మొండికేస్తున్నందున, గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి ఆమెను అధికారికంగా బర్తరఫ్ చేయాలి. ఆమె ప్రవర్తన దృష్ట్యా, ఆమెను ఆ పదవి నుంచి తొల‌గించాలి. ఆఫీస్ నుంచి ఆమెను బయటకు గెంటేయాలి” అని జెఠ్మలానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇప్పటికీ కార్యాలయాన్ని ఆక్రమించుకుంటే, గవర్నర్ పోలీసులను పంపి ఖాళీ చేయించవచ్చని సూచించారు. “ఫలితాలు ధ్రువీకరించిన తర్వాత ఆమె సీఎం కార్యాలయంలో ఒక చొరబాటుదారు మాత్రమే” అని స్పష్టం చేశారు.

 

మరోవైపు తాను ఓడిపోలేదని, అందుకే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేయనని మమతా బెనర్జీ ప్రకటించారు. తన పార్టీ నుంచి 100 సీట్లను దొంగిలించారని ఆమె ఆరోపించారు. దీనిపై జెఠ్మలానీ స్పందిస్తూ, ఆరోపణలకు ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలని, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయ్యే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. బెంగాల్ అసెంబ్లీ ప్రస్తుత టర్మ్ ఈ నెల‌ 7తో ముగియనుండటంతో ఈ పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.