రిటైల్ ఇంధన లభ్యతపై కేంద్రం భరోసా ఇచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టపోవడం పట్ల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే ఆ భారాన్ని దేశీయ వినియోగదారులపై మోపే పరిస్థితి రావొచ్చని అభిప్రాయపడ్డారు.
దేశంలో చమురు సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. చమురు సరఫరాలో ఇబ్బందులేమీ లేవని హామీ ఇచ్చారు. దేశంలో తగినన్ని చమురు నిల్వలున్నాయని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 69 రోజులకు సరిపడే క్రూడాయిల్, ఎల్ఎన్జీ నిల్వలు ఉన్నాయని అన్నారు. 45 రోజులకు సరిపడా ఎల్పీజీ స్టాక్ ఉందని స్పష్టం చేశారు. ఎల్పీజీ ఉత్పత్తిని దేశంలో గణనీయంగా పెంచినట్లు తెలిపారు.
రోజుకు 35,000 టన్నుల నుంచి 50,000 టన్నుల వరకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచామని అన్నారు. ప్రస్తుత పశ్చిమాసియా యుద్దం వల్ల తలెత్తిన సంక్షోభాన్ని సమర్ధవంతంగా, బాధ్యతగా ఎదుర్కొన్నామని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సలహా ప్రజలను అప్రమత్తం చేయడానికేనని తెలిపారు. దేశంపై ఆర్థికభారం పడకుండా ఆయన ఈ సూచన చేశారని తెలిపారు.

