TELANGANA

బండి సంజయ్ సంచలన ప్రకటన..! నా కుమారుడ్ని పోలీసులకు అప్పగించాను..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ స్వయంగా వెల్లడించారు. ఈ కేసులో చట్ట ప్రకారం విచారణకు సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. “చట్టం ముందు నా కుమారుడు అయినా, సామాన్యుడు అయినా అందరూ సమానమే. పోలీసులపై ఉన్న గౌరవంతోనే భగీరథ్‌ను అప్పగించాను. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే” అని స్పష్టం చేశారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను న్యాయవాదుల ద్వారా పోలీసుల ముందు ఉంచినట్లు వివరించారు.

 

వాస్తవానికి, ఈ ఫిర్యాదు వచ్చినప్పుడే భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాలని భావించినట్లు సంజయ్ పేర్కొన్నారు. ఆధారాలను చూపేందుకే ఆలస్యం అయిందని అన్నారు. ఇంకా జాప్యం చేయడం భావ్యం కాదని తన బిడ్డను పోలీసులకు అప్పగించినట్టు వివరించారు. ఆధారాలను పరిశీలించి కేసును కొట్టివేస్తారని, తప్పకుండా బెయిల్ వస్తుందని న్యాయవాదులు చెప్పారని ఆయన అన్నారు. ఇవాళే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.