TELANGANA

రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. ఒక్క హైదరాబాద్‌లోనే 16,000 దుకాణాలు క్లోజ్.!

ఆన్ లైన్ లో మెడిసన్స్ విక్రయాన్ని నిరసిస్తూ రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD).. రేపు బంద్ కు పిలుపునిచ్చింది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బుధవారం సుమారు 12.40 లక్షలకు పైగా ఔషద దుకాణాలు, డిస్ట్రిబ్యూటర్లు.. తమ సేవలను నిలిపివేయనున్నారు.

 

కేంద్రం ప్రభుత్వం ఆన్ లైన్ మందుల సరఫరాకు అనుమతిస్తూ తీసుకొచ్చిన నిబంధనలు తక్షణమే రద్దు చేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి పర్యవేక్షణ లేని ఆన్‌లైన్ ఫార్మసీల (Online Pharmacies) వల్ల నకిలీ మందుల అమ్మకాలు పెరుగుతున్నాయని.. ఇది అటు ప్రజల ఆరోగ్యానికి, ఇటు తమ వ్యాపారాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నిబంధనల పేరుతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మెడికల్ షాపుల యజమానులను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే బుధవారం ఒక్క తెలంగాణలోనే దాదాపు 30 వేలకు పైగా మెడికల్ షాపులు బంద్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. అందులోనూ హైదరాబాద్ లోనే 16వేలకు పైగా మెడికల్ షాపులు క్లోజ్ అవుతాయని తెలుస్తోంది. అయితే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మినహాయింపులు పాటించాలని కెమెస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని అమృత్ ఫార్మసీలు, ఇన్‌సైడ్ హాస్పిటల్ మెడికల్ షాపులు యథావిధిగా పనిచేస్తాయని వారు పేర్కొన్నారు. అత్యవసర మందులు అందించే 24/7 మెడికల్ స్టోర్లకు ఈ బంద్ నుండి మినహాయింపునిచ్చారు.

 

కాగా, బంద్ పిలుపుతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రేపు ఏదైనా మందులు అత్యవసరం అయితే తమ పరిస్థితి ఏంటా అని వాపోతున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు (షుగర్, బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు) ముందస్తుగానే రెండు మూడు రోజులకు సరిపడా మందులను కొనుగోలు చేసి పెట్టుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో నిరవధిక బంద్‌కు కూడా వెనుకాడబోమని కెమిస్ట్స్ అసోసియేషన్ హెచ్చరించింది.