కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్కు పోక్సో కేసుకు సంబంధించి మల్కాజ్గిరి కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం ప్రాసిక్యూషన్ పిటిషన్పై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణ కోసం భగీరథ్ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, కోర్టు మూడు రోజులకు మాత్రమే అనుమతించింది. దీంతో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్ను పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
అంతకుముందు, పోలీసు కస్టడీ పిటిషన్ను భగీరథ్ తరపు న్యాయవాది కరుణాసాగర్ వ్యతిరేకించారు. ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య మాత్రమే విచారణ జరపాలని, విచారణకు ముందు, తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. విచారణ సమయంలో బలవంతపు పద్ధతులు వాడకుండా పోలీసులను ఆదేశించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై మే 8న భగీరథ్పై పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధితురాలి వాంగ్మూలం తర్వాత పోలీసులు కేసులో కఠినమైన సెక్షన్లను జోడించారు. మే 16న హైకోర్టులో మధ్యంతర రక్షణ లభించకపోవడంతో పోలీసులు భగీరథ్ను అరెస్ట్ చేశారు. అయితే, తన కుమారుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని బండి సంజయ్ తెలిపారు. నేరం అంగీకరించిన తర్వాతే అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

