తెలంగాణను డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కేంద్రంతో కీలక చర్చలు
అమెండేడ్ భారత్నెట్ ప్రోగ్రామ్ (ABP) కింద రాష్ట్రంలో ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టును వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టు ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయడం, పెండింగ్ నిధుల విడుదల, మండలం నుండి గ్రామ పంచాయతీ రింగ్ నెట్వర్క్ ఆస్తులను ‘డిజిటల్ భారత్ నిధి’కి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనికి కేంద్ర మంత్రి సింధియా సానుకూలంగా స్పందిస్తూ.. పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
రింగ్ ఆర్కిటెక్చర్ ప్రత్యేకత
రాష్ట్రంలో నిర్మిస్తున్న ఏకీకృత డిజిటల్ నెట్వర్క్లో ‘రింగ్ ఆర్కిటెక్చర’’ కీలకమైంది. దీనివల్ల ఒక మార్గంలో ఇంటర్నెట్ కేబుల్ దెబ్బతిన్నా, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అంతరాయం లేని హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుతాయి. ఇందుకోసం ప్రభుత్వం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
మొదటి దశలో 3,089 గ్రామాలు
తొలి దశలో భాగంగా గతంలో నెట్వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పునరుద్ధరించనున్నారు. ఆధునిక ఫైబర్ మౌలిక సదుపాయాలతో ఈ గ్రామాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా అనుసంధానించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

