ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు తనిఖీ చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ పర్యటన పాలమూరు ప్రాంతంలో భవిష్యత్ నీటి పారుదల అభివృద్ధి గమనాన్ని నిర్దేశించే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. జల సౌధలో సీనియర్ అధికారులతో మంగళవారం జరిపిన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు.
పాలమూరులో సీఎం పర్యటన
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి లో ఉన్న, ప్రతిపాదిత నీటి పారుదల పనుల స్థితిని సమీక్షించడం, ఎదురయ్యే అడ్డంకులను అంచనా వేయడం, వాటి పరిష్కారం కోసం అవసరమైన చర్యలను గుర్తించడంపై ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. దాంతోపాటు కరువు పీడిత పాలమూరు ప్రాంతంలో నీటి పారుదల సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయికి పెంచి లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో చేపట్టిన కీలక నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాన విధాన నిర్ణయాలు, మంజూరులు, భారీ నిధుల విడుదల జరిగే అవకాశం ఉందన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై సవివర సమీక్ష
పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు సీనియర్ మంత్రులు ఉండే అవకాశం ఉందని చెప్పారు. పాలమూరు ప్రాంతంలో ఆచరణ సాధ్యమైన అన్ని సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తి పోతల పథకం, కోయిల్సాగర్, భీమా, నెట్టంపాడు, ఈ ప్రాంతంలోని ఇతర కీలక నీటి పారుదల పనులతో సహా ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులపై సవివరమైన ప్రజెంటేషన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.
ప్రాజెక్టుల పురోగతిపై వివరాలు
ఈనెల 4న సాయంత్రం సమయంలో సోమశిలలో ఒక ప్రధాన ప్రజెంటేషన్ సెషన్ను ప్రతిపాదించారు, అక్కడ సీనియర్ ఇంజనీర్లు వివిధ ప్రాజెక్టుల స్థితి, సవాళ్లు మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రికి వివరించనున్నారు. సమీక్షా సమావేశంలో లాజిస్టిక్స్, వసతి, భద్రతా ఏర్పాట్లు, రవాణా మరియు వైమానిక తనిఖీలపై కూడా చర్చించారు. ఈ పర్యటన కోసం రెండు హెలికాప్టర్లను వినియోగించనున్నారు.
మౌలిక సదుపాయాలపై సీఎం ప్రత్యేక దృష్టి
దీని వల్ల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ ప్రాంత వ్యాప్తంగా నీటి పారుదల మౌలిక సదుపాయాలు , ప్రాజెక్ట్ సైట్లలో విస్తృతమైన వైమానిక సర్వేలను చేపట్టగలుగుతారు. సీఎం రెండు రోజుల పర్యటనకు సంబంధించిన ప్రణాళిక, ప్రాజెక్టుల వారీగా ప్రజెంటేషన్లు, క్షేత్రస్థాయి తనిఖీలు, లాజిస్టికల్ ఏర్పాట్లపై జరిగిన చర్చల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. వారితోపాటు నీటి పారుదల శాఖ, ఇతర సంబంధిత శాఖల సీనియర్ అధికారులు ప్రత్యక్షంగా, వర్చువల్గా హాజరయ్యారు.

