కృష్ణమ్మ జలాలతో పాలమూరు జిల్లాలోని పంటలను పచ్చగా కలకలలాడేలా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు కీలక ప్రాజెక్టులను సీఎం రేవంత్ పరిశీలించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ,కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదించిన నూతన బ్యారేజీల స్థలాలు, జూరాల ప్రాజెక్టు డ్యాంను సీఎం వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, నీటి నిల్వల సామర్ధ్యాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే మక్తల్ నారాయణపేటలో కొడంగల్ ఎత్తిపోతల పథకం పరిధిలోని పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్లాన్ మ్యాప్స్ ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు ప్రగతి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం మక్తల్ మండలం కాట్రేపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టు ప్యాకేజీ వన్ సైట్ వద్దకు చేరుకుని అక్కడి పనులను పరిశీలించారు.
ప్యాకేజీ వన్ లో భాగంగా జరుగుతున్న పంప్ హౌస్ పనులు ఎంత మేరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీట్ పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి రంగానికి ఈ పథకం అత్యంత కీలకమని, పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుండడంతో దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
ప్రాజెక్టుల ప్రత్యక్ష, ఏరియల్ సర్వే అనంతరం సీఎం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులన్నింటిని యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా సీఎం పర్యటనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తో పాటు కర్ణాటక మాజీ మంత్రి ఎన్ఎస్ బోసిరాజు తదితరులు పాల్గొన్నారు.

