AP

ఏపీకి మరో గుడ్ న్యూస్..! ఏపీలో రేర్ ఎర్త్ హబ్.. !

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, మాస్కోలో కీలక సమావేశంలో పాల్గొన్నారు. రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ ఖనిజాల సంస్థ ‘గిరెడ్‌మెట్ ఇనిస్టిట్యూట్’ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

 

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో లభించే భారీ ఖనిజ వనరులను ఉపయోగించుకుని, ఒక డీప్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్ (ఆర్ఈఈ) రిఫైనింగ్ హబ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. అలాగే, భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పవన విద్యుత్ మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు గిరెడ్‌మెట్ సాంకేతికతతో నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పేందుకు భాగస్వామ్యం కావాలని కోరారు.

 

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, “విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరులను ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ (ఆర్ఈఈ) రిఫైనింగ్ హబ్ ఏర్పాటుకు, నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు భాగస్వామ్యం వహించాలని కోరాను” అని తెలిపారు.

 

మాస్కోలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియాన్ని కూడా లోకేష్ సందర్శించారు. ఈ పర్యటన తనకు ఒక ప్రత్యేక అనుభూతినిచ్చిందని, విజ్ఞానం, చరిత్ర, సాంకేతికతల సమన్వయ వేదికగా ఈ మ్యూజియం నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.