కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏడు రోజుల్లోగా మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలను ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
నిన్న జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తాము చేపట్టిన శాంతియుత నిరసన ఒక చరిత్ర అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. “‘బొద్దింకలు’ ఏకమైతే ఏం చేయగలవో ప్రభుత్వానికి మేం చూపించిన ట్రైలర్ ఇది. నిన్నటి నిరసనలో పాల్గొన్న వారిలో చాలామందికి అదే తొలిసారి. అయినా, విద్యావ్యవస్థపై తమకున్న తీవ్రమైన కోపాన్ని, నిరాశను వ్యక్తం చేయడానికి వారు ధైర్యంగా ముందుకు వచ్చారు” అని ఆయన తెలిపారు.
మండే ఎండను సైతం లెక్కచేయకుండా నిరసనలో పాల్గొన్న యువత, విద్యార్థులు సహా ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. “శాంతియుత నిరసనే మన గొప్ప బలం. ఐక్యంగా ఉన్న శాంతియుత ఉద్యమాన్ని ప్రభుత్వం ఏమీ చేయలేదు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు” అని దీప్కే అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ ఒక తరానికి అన్యాయం చేశారని ఆరోపించిన ఆయన, ఈ విషయం ఇక్కడితో ముగిసిపోదని స్పష్టం చేశారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈరోజు ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడతానని ఆయన తన అనుచరులకు సూచించారు.

