తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ సముదాయంలోని మహాకాళి అమ్మవారి ఆలయంలోకి చొరబడి, వెండి కిరీటంతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో భక్తులు, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
మంగళవారం ఉదయం నిత్య పూజల కోసం వచ్చిన అర్చకులు ఆలయ ద్వారాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆలయ ప్రాంగణంలోని పై అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయం గేటును పగలగొట్టిన దొంగలు, సుమారు 1.5 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని అపహరించారు. అనంతరం హుండీని పగలగొట్టి అందులోని నగదును దోచుకుని, ఖాళీ హుండీని సమీపంలోనే పడేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిళ, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.
గోదావరి నది తీరాన కొలువుదీరిన ఈ ఆలయాన్ని భక్తులు ‘దక్షిణ గంగ’గా పిలుచుకుంటారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన అనంతరం వేదవ్యాస మహర్షి ఇక్కడ సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలను ప్రతిష్ఠించారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇటీవల ఏప్రిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 225 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన తరుణంలో, ఈ భారీ చోరీ జరగడం భద్రతా వైఫల్యాలపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఈ ఘటన నేపథ్యంలో ఆలయంలో భక్తుల కానుకల లెక్కింపు ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వెల్లడించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కోయిలకుంట్ల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలోనూ హుండీ చోరీ జరగడం గమనార్హం

