National

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు ‘నో’ చెప్పిన సుప్రీంకోర్టు..!

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణ.. రాయితీలపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన 22ఏళ్ల పిటిషనర్.. 2025 నీట్ యూజీ పరీక్షలకు హాజరయ్యాడు. సదరు అభ్యర్థి జనరల్ కేటగిరీకి చెందిన వాడైనా ఆర్థికంగా వెనకబడిన తరగతి (ఈడబ్ల్యుఎస్)కి చెందిన వాడన్న సర్టిఫికెట్ ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వార్షిక ఫీజులు 18.9లక్షల నుంచి 25లక్షల వరకు ఉండటంతో సదరు అభ్యర్థి మొదటి రెండు రౌండ్ల కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు.

 

మూడో కౌన్సిలింగ్ కోసం రాజస్థాన్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఉత్తర్వులు పొంది ఈడబ్ల్యుఎస్ కేటగిరీ కింద హాజరయ్యాడు. ప్రాధాన్యతలుగా 73 కాలేజీలను పేర్కొన్నాడు. అయితే, కౌన్సిలింగ్ జరిపిన బోర్డు ఆ అభ్యర్థికి ఓ కాలేజీలో జనరల్ సీటును కేటాయించింది. దాంతో ఆ అభ్యర్థి తాను ప్రాధాన్యతగా ఇచ్చిన కాలేజీలో ఈడబ్ల్యుఎస్ సీట్లు ఖాళీగా ఉన్నా జనరల్ సీటును కేటాయించటంపై హైకోర్టును ఆశ్రయించాడు. జనరల్ కేటగిరీ అభ్యర్థుల నుంచి తీసుకుంటున్నట్టుగానే ఈడబ్ల్యుఎస్ అభ్యర్థుల నుండి కూడా అంతే భారీ మొత్తంలో ట్యూషన్ ఫీజు వసూలు చేయడాన్ని సవాలు చేశారు.

 

Advertisement

ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో 50% సీట్ల ఫీజులను సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఫీజులతో సమానంగా ఉంచాలని నేషనల్ మెడికల్ కమిషన్ మెమోరాండంను సమర్పించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు సింగిల్ బెంచ్, ఆ తరువాత డివిజన్ బెంచ్ కూడా కొట్టివేశాయి. 103వ రాజ్యాంగ సవరణ కింద ఇచ్చే ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కేవలం అడ్మిషన్ పొందే సమయంలో మాత్రమే వర్తిస్తుందని న్యాయస్థానం పేర్కొంది. చట్టపరమైన నిబంధన, బైండింగ్ ఆదేశం లేనపుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజు రాయితీని పొందే హక్కును ఇది కల్పించదని స్పష్టం చేసింది.

 

అయితే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సదరు పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగరత్న, బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజులను సమానం చేస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మూతపడే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ సీట్ల పెంపు వల్ల ప్రైవేట్ కాలేజీలు ప్రయోజనం పొందుతున్నాయన్నారు. ఆ సీట్లను జనరల్ సీట్లుగా మార్చుకుని లాభాలు గడిస్తున్నాయని చెప్పారు.

 

Advertisement

దీనిపై స్పందిస్తూ దానికి న్యాయమూర్తి అలా జరగకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వైద్య విద్యలో ఆయా రాష్ట్రాలకు చెందిన సహకారం శూన్యంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నడిపిస్తున్న వారు వాటిని మూసివేసి ఇతర రంగాల్లోకి వెళతారని చెప్పారు. దేశానికి వైద్యులు అవసరం అని అన్నారు. ఆ సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని న్యాయవాది కోరారు. దానికి జస్టిస్ నాగరత్న స్పందిస్తూ ఉన్నవారు చెల్లిస్తారని చెప్పారు.

 

పిటిషనర్ చెల్లించలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారని న్యాయవాది చెప్పగా అది వేరే విషయమన్నారు. ‘స్కాలర్‌షిప్ లేదా సబ్సిడీ పొందండి. లేదా ప్రభుత్వ కాలేజీలో సీటు సంపాదించండి’ అని పేర్కొన్నారు. ఎన్ఎంసీ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఆ సంస్థ మెమోరాండమ్‌కు చట్టపరమైన బలం ఉందన్న న్యాయవాది వాదనతో బెంచ్ ఏకీభవించలేదు. రాజస్థాన్ రాష్ట్రం ఈ మెమోరాండమ్‌ను ఆమోదించలేదని పేపర్‌బుక్ ద్వారా తెలుస్తోందని జస్టిస్ బాగ్చీ అన్నారు. అనంతరం పిటిషన్ ను కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.