రాష్ట్రంలో సాంప్రదాయ వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకువస్తూ, రైతులను లాభసాటి పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా పంటల మార్పిడిపై ఒక ఉన్నత స్థాయి ‘రాష్ట్రస్థాయి కమిటీ’ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పంటలు మార్చేలా ప్రోత్సహించడానికి ఈ కమిటీని రంగంలోకి దించనుంది. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు విస్తృత అవగాహన కల్పించనున్నారు.
సాంప్రదాయ పంటల సాగు..
వ్యవసాయరంగంపై రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారు. 2025-26 రబీలో 44లక్షల60వేల390 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇతర పంటలు కేవలం 30.19లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అయితే ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఇబ్బందులు, ఇతర పంటల సాగు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతు సంక్షేమానికి వ్యూహాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు, సాంప్రదాయ పంటల సాగు వల్ల వచ్చే నష్టాలను నివారించేందుకు “పంటల మార్పిడి” విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అత్యున్నత నిర్ణయాలు, ప్రణాళికల కోసం ఒక ఉన్నత స్థాయి రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటుకు సర్కారు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
విస్తృత ప్రాతినిధ్యం.. నిపుణులతో కూర్పు..
ఈ కమిటీ కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటికీ సమాన ప్రాతినిధ్యం కల్పించేలా రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసి, ఆచరణాత్మక సిఫార్సులు చేసేందుకు వీలుగా కమిటీ సభ్యుల ఎంపిక ఉండబోతోందని వ్యవసాయాధికారులు తెలిపారు.వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, పట్టుపరిశ్రమ, ఆగ్రోస్, మార్కెటింగ్, సీడ్ కార్పొరేషన్ నుంచి ఒకరినికమిటీలో మెంబర్గా నియమించనున్నట్లు సమాచారం. అదే విధంగా రైతు కమిషన్ సభ్యుల నుంచి కేవీఎన్ రెడ్డిని కమిషనర్ రిఫర్ చేసినట్లు సమాచారం. విధానపరమైన నిర్ణయాల్లో స్పష్టత కోసం రైతు కమిషన్ నుంచి కూడా ఒక సభ్యుడిని ఈ కమిటీలో చేర్చాలని ప్రతిపాదించారు.
ఉన్నత స్థాయి అధికారి..
అదే విధంగా పంటల మార్పిడికి అవసరమైన ఆర్థిక వనరులు, రుణ సదుపాయాలు, ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను అంచనా వేసేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారిని సైతం ఈ కమిటీలో సభ్యుడిగా చేర్చుతున్నట్లు సమాచారం. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ (ఎస్ఎల్బీసీ) నుంచి ఒకరు సభ్యుడిగా ఉంటారని సమాచారం.
కమిటీ ప్రధాన లక్ష్యాలు ఇవే..
లాభసాటి పంటల గుర్తింపు: ఒకే రకమైన పంటలు వేసి నష్టపోకుండా, మార్కెట్లో మంచి ధర పలికే ప్రత్యామ్నాయ పంటలను రైతులకు సూచించడం.పంటల మార్పిడి ద్వారా భూమి ఉత్పాదకతను, సారాన్ని కాపాడటం.వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల (డైరీ, పౌల్ట్రీ, తోటల పెంపకం) ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రచించడం.
జిల్లాల్లో రివ్యూలు సైతం..
కమిటీని నియమించిన తర్వాత అన్ని జిల్లాల్లో వ్యవసాయ అధికారులు, మిల్లర్లు, ఆదర్శ రైతులతోపత్యేకంగా రివ్యూలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో సాగవుతున్న పంటలకు ప్రత్యామ్నాయపంటలు ఏవి వేయాలి? మార్కెటింగ్ సదుపాయం, గిట్టుబాటు ధరలు, కొనుగోళ్లపై అవగాహన కార్యక్రమాలు వంటివి సమీక్షించి వరికి ప్రత్యామ్నాయపంటలు వేసేలా ప్రోత్సహించనున్నారు. సాగు యాజమాన్య పద్దతులపై వ్యవసాయాధికారులు తీసుకోవాల్సి అంశాలపైనా వారికి దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. వరివేసి రైతులు పడుతున్న ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటుందని అధికారులే పేర్కొంటున్నారు.
మారనున్న గ్రామీణ ఆర్థిక చిత్రం
ప్రస్తుతం ఒకే రకమైన పంటలు వేయడం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు, మార్కెట్లో ధరలు పతనమై రైతులు నష్టపోతున్నారు. ఈ రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు ద్వారా ఏ ప్రాంతంలో ఏ పంటలు మార్పిడి చేయాలి? ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ లింకేజీ ఎలా కల్పించాలి? అనే అంశాలపై శాస్త్రీయ అధ్యయనం జరగనుంది. త్వరలోనే ఈ కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనివల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం సరికొత్త మలుపు తిరగనుందనిపలువురు భావిస్తున్నారు.
అధికారిక ఉత్తర్వులు..
పంటల మార్పిడి అనేది కేవలం ఒక నినాదంగా మిగిలిపోకుండా, క్షేత్రస్థాయిలో రైతులకు సంపూర్ణ సాంకేతిక, ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. రైతు కమిషన్ ఇచ్చిన ఈ సిఫార్సులపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే ఈ రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

