TELANGANA

యూరియా యాప్‌లో పెద్ద స్కామ్..? రియల్ ఎస్టేట్ దందా కోసమేనా..? కేతిరెడ్డి సంచలన ఆరోపణలు..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘యూరియా యాప్’ వివాదంలో చిక్కుకుంది. ఈ మొబైల్ అప్లికేషన్ నుండి మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పేర్లు మాయం కావడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వం పెద్ద కుట్రకు తెరలేపిందని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తీరును ఎండగడుతూ పలు ప్రశ్నలు సంధించారు.

రియల్ ఎస్టేట్ దందా కోసమేనా?

ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న యూరియా యాప్ అసలు రంగు ఒక్కొక్కటిగా బయటపడుతోందని వాసుదేవరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం కంటే, భూముల అమ్మకాలు, రియల్ ఎస్టేట్ దందాపైనే ఎక్కువ ప్రేమ ఉందనడానికి ఈ జిల్లాల తొలగింపే నిదర్శనమన్నారు. ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి అవసరమైన భూములను లాక్కోవడానికే, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రైతులకు యూరియా పంపిణీని నిలిపివేసేందుకు ఈ కుట్ర చేశారా అని ఆయన నిలదీశారు.

హైదరాబాద్ ఉంది.. వ్యవసాయ భూములున్న జిల్లాలు లేవా?

అసలు వ్యవసాయ భూములే లేని హైదరాబాద్ సిటీ పేరును యాప్‌లో ఉంచి, వేలాది ఎకరాల సాగు భూములు, లక్షలాది మంది రైతులు ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను తొలగించడంలో అంతర్యం ఏంటని వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. సమయానికి యూరియా అందకపోతే పంటల దిగుబడి ఎలా వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ యాప్ దేశానికే ఆదర్శమంటూ గొప్పలు చెప్పుకున్న అగ్రికల్చర్ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ప్రభుత్వం అట్టర్ ప్లాప్

 

రైతులకు సక్రమంగా యూరియా అందించడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా అట్టర్ ప్లాప్ అయిందని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండివైఖరి వీడి, ఫెర్టిలైజర్ యాప్‌లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పేర్లను తక్షణమే పునరుద్ధరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.