పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ (ఈ20) కలిపే కార్యక్రమంపై ఇంకా ప్రయోగాత్మక అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విధానం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో వచ్చే ఏడాదికి స్పష్టమైన ఫలితాలు అందుతాయని వెల్లడించింది. పాత వాహనాలపై ఈ20 పెట్రోల్ ప్రభావం చూపుతుందన్న చర్చలు కొనసాగుతున్న వేళ కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ20 ఇథనాల్ సరఫరాకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇథనాల్ సరఫరా ఒప్పందాలు ఇప్పటికే ఖరారయ్యాయని, వాటిలో ఒక్కో సంస్థ కోసం మార్పులు చేస్తే దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమంపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు.
అయితే, పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం మారే అవకాశం లేదని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. ఇథనాల్ సరఫరా పరిమాణం మాత్రం డిమాండ్, ఇతర పరిస్థితులను బట్టి మారవచ్చని తెలిపారు. ఈ20 పెట్రోల్పై కొంతకాలంగా వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాత వాహనాల ఇంజిన్కు నష్టం కలిగే ప్రమాదం ఉందని, మైలేజ్ తగ్గే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి ఆరోపణలకు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రం చెబుతోంది.
ఇథనాల్ మిశ్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గి విదేశీ మారక నిల్వలు ఆదా అవుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమం వల్ల రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక వ్యయం తగ్గిందని పేర్కొంది. రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని వివరించింది.
దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ సరఫరా ఇప్పటికే ప్రారంభమైంది. 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన గడువుకంటే ఐదేళ్ల ముందే, 2025లోనే సాధించింది. ఇప్పుడు 2030 నాటికి ఈ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది

