సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఒకరి హక్కులను మరొకరు హరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.
మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని పవన్ అన్నారు. వ్యక్తిగత దూషణలు, చంపేస్తామని బెదిరించడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతిస్తుందని చెప్పారు.
సైబర్ వేధింపులు, పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. నేరస్థులకు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాధితులు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై బీఎన్ఎస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

