శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కుమారుడిని కాపాడేందుకు అప్పలరాజు కుట్ర చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ప్రమాదానికి కారణమైన ఆరవ్ వర్మకు బదులుగా సిద్ధార్థ త్యాడి అనే వ్యక్తిని కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేశారని, బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టారని, అలాగే ప్రమాదానికి సంబంధించిన బైక్ను మార్చి ఆధారాలను తారుమారు చేయాలని చూశారన్న అభియోగాలతో అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

